నానో బనానా ఫోటో కోసం ఆశపడితే సైబర్ నేరగాడు రూ.70వేలు కొట్టేశాడు

  • ఫోటోను త్రీడీగా మార్చుకునేందుకు ప్రయత్నించగా రూ.70వేలు మాయం
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
సోషల్ మీడియాలో నానో బనానా ఫొటో ట్రెండ్‌ పెద్ద ఎత్తున వైరల్‌ అవుతుండగా, అదే ట్రెండ్‌ను అనుసరించి తన ఫొటోను త్రీడీగా మార్చుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో జరిగింది. 
 
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..  సోషల్ మీడియాలో నానో బనానా ఎడిట్‌ చేసిన ఫొటోలు చూసి, తానూ కూడా అలాంటి ఫొటో తీసుకోవాలన్న ఉత్సాహంతో, ఫేస్‌బుక్‌లో వచ్చిన ఒక ఇమేజ్ ఎడిటింగ్ యాప్ లింకును క్లిక్ చేసి తన మొబైల్‌‌లో డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్ ద్వారా తన ఫొటోను త్రీడీ ఫార్మాట్‌లోకి మార్చిన కొద్ది సమయంలోనే అతని బ్యాంకు ఖాతా నుండి రూ.70 వేలు మాయమయ్యాయి. దీంతో అతడు షాకయ్యాడు. 
 
ఇది సైబర్ నేరగాళ్లు చేసిన పనిగా గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక దర్యాప్తులో ఇది సైబర్ నేరగాళ్ల కుతంత్రంగా పోలీసులు గుర్తించారు. 
 
ఇలాంటి ఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. అనుమానాస్పద లింకులు, గుర్తు తెలియని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయొద్దని, సున్నితమైన సమాచారం ఇతరులతో పంచుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.

Nano Banana
Nano Banana photo
Cyber fraud
Rajanna Sirisilla
Cyber crime
3D photo editing
Image editing app
Online fraud
Social media scam

More Telugu News